వైసీపీ (YCP) నేత యార్లగడ్డ వెంకట్రావు ఎగ్జిట్ ఖాయమయిపోయింది. వచ్చేఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో జగన్ ను కలుస్తానని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది ఇక నామమాత్రమే. బహుశా నారా లోకేష్ పాదయాత్రలో ఆయన పసుపు కండువా కప్పుకునే అవకాశముంది. గత ఆదివారం ఆత్మీయ సమావేశం పెట్టిన యార్లగడ్డ వెంకట్రావు మరోసారి ముఖ్య అనుచరులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలోనే ఆయన వైసీపీ నుంచి వైదొలగడం ఖాయమని తేల్చిచెప్పారు. నేరుగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తాను గన్నవరం నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పారు. తన అనుచరులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని కోరుతున్నారని, ఈ విషయంపైన కూడా తాను పరిశీలిస్తున్నానని యర్లగడ్డ తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో… (YCP)
2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయిన యార్లగడ్డ వెంకట్రావు రానున్న ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతుదారుగా మారడం, వచ్చేఎన్నికల్లో వంశీకే వైసీపీ టిక్కెట్ దాదాపు కన్ఫర్మ్ కావడంతో యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ హైకమాండ్ కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో తాను తెలుగుదేశం పార్టీలో చేరి లక్ ను పరీక్షించుకోవాలనుకుంటున్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన పార్టీని వీడటానికి కారణంగా చెబుతున్నారు. తాను తెలుగుదేశం పార్టీనేతలను ఇప్పటి వరకూ కలవలేదని యార్లగడ్డ అంటున్నప్పటికీ, ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. టీడీపీ అధినాయకత్వం కూడా యార్లగడ్డ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
త్వరలోనే…
దీంతో త్వరలోనే యార్లగడ్డ వెంకట్రావు పసుపు కండువా కప్పుకోవడం ఖాయమైంది. ముహూర్తం ఎప్పుడనేదే నిర్ణయం కావాల్సి ఉంది. గన్నవరంలో ఆయన ఇప్పటికే వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో కలసి పలు దఫాలు చర్చలు జరిపారు. ఇద్దరు కలసి వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఎంత పోరాడినా హైకమాండ్ నుంచి మాత్రం వంశీకే మద్దతు ఎక్కువగా ఉంది. దీంతో దుట్టా రామచంద్రరావు పరిస్థితి ఏంటో తెలియదు కాని యార్లగడ్డ వెంకట్రావు మాత్రం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీకి కూడా గన్నవరంలో సరైన అభ్యర్థి అవసరం. అయితే యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడుతున్నారని తెలియగానే దాసరి బాలవర్థనరావు చంద్రబాబును ఇటీవల కలవడం కూడా చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీతో దాసరి కుటుంబానికి సుదీర్ఘ కాలం అనుబంధం ఉంది. గతంలో దాసరి బాలవర్థన్ రావు గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేశారు. వారికి ప్రత్యేక అనుచరగణం కూడా ఉంది.
దాసరి కుటుంబం… (YCP)
కానీ దాసరి కుటుంబం గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోంది. గన్నవరం రాజకీయాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే వల్లభనేని వంశీ పార్టీని వీడటంతో మళ్లీ టీడీపీలో క్రియాశీలకం కావాలని దాసరి కుటుంబం ఆలోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీని తాము అయితేనే సమర్థవంతంగా ఎదుర్కొంటామని దాసరి బాలవర్ధన్ రావు అనుచరులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. యార్లగడ్డ వెంకట్రావుకు పార్టీ బలమే తప్ప వ్యక్తిగత బలంలేదని, ఆయన స్థానికేతరుడని కూడా ఇప్పటికే టీడీపీలోని ఒక వర్గం క్యాంపెయిన్ ను నడుపుతుంది. పారాచూట్ నేతలకు టిక్కెట్లు ఎలా ఇస్తారంటూ మరికొందరు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావును పార్టీలో చేర్చుకుంటే గన్నవరంలో వల్లభనేని వంశీని ఓడించవచ్చన్నది టీడీపీ హైకమాండ్ ఆలోచనగా ఉంది. మరి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. (YCP)