ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీలో విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ నేతలు వీధిన పడుతున్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు సీటే ముఖ్యమన్న సంకేతాలను బలంగా పంపుతున్నారు. అందుకు అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధపడుతున్నారు. జగన్ కు అత్యంత నమ్మకమైన నేతలు, తొలి నుంచి జగన్ తో ప్రయాణిస్తున్న లీడర్లు సయితం పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో అధికార పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒక గ్రూపు ఉండటం పార్టీ అధినేతకు తలనొప్పిగా మారింది.
ఇద్దరి నేతల మధ్య…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అక్కడ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య నువ్వా? నేనా? అన్నట్లు పోటీ ఉంది. రెండు వర్గాలు పోటా పోటీగా ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఇది ప్రత్యర్థులకు అడ్వాంటేజీగా మారుతుందన్న ఆందోళన వైసీపీ హైకమాండ్ లో కనిపిస్తుంది. ఎవరు కూడా వినే స్థితిలో లేరు. జగన్ అంటే తమకు అత్యంత గౌరవమని ఇద్దరు నేతలు చెబుతారు. కానీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తమదేనంటూ మరో ప్రకటన చేస్తూ ఇటు క్యాడర్ లోనూ, ప్రజల్లోనూ గందరగోళం సృష్టిస్తున్నారు.
తొలి సారి చేరిన…
పిల్లి సుభాష్ చంద్రబోస్ సీనియర్ నేత. వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. వైసీపీలో తొలుత జగన్ వెంట నడిచిన నేతగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గా గుర్తింపు పొందారు. 2014లో జగన్ రామచంద్రాపురం టిక్కెట్ ఇచ్చినా పిల్లి గెలవలేకపోయారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జగన్ తన వెంట నడిచిన వారికి పదవి కట్టబెట్టారు. 2019 ఎన్నికలకు వచ్చే సరికి రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను ఎంపిక చేశారు. ఆయన విజయం సాధించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మంత్రి పదవి ఇచ్చారు. అయితే శాసనమండలి రద్దు చేస్తామని చేసిన ప్రకటనతో ఆయనను రాజ్యసభకు పంపాల్సి వచ్చింది. ఆయన స్థానంలో మంత్రివర్గంలోకి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ నేతల మధ్య విభేదాల తలెత్తాయి. అవి రాను రాను మరింత ముదిరిపోయాయి.
ఒకరిపై ఒకరు…
చెల్లుబోయిన తన వర్గాన్ని అణిచివేస్తున్నారని, తన వర్గం వారిపై అక్రమంగా కేసులు బనాయించేలా మంత్రి పోలీసులను ఆదేశిస్తున్నారని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపణ. అయితే తనకు పిల్లి అంటే గౌరవమని కేవలం కొందరు తనపై దుష్ప్రచారానికి దిగుతున్నారని చెల్లుబోయిన చెబుతూ వస్తున్నారు. తాడేపల్లి కార్యాలయానికి రామచంద్రాపురం పంచాయతీ వచ్చింది. పిల్లితో నేరుగా జగన్ మాట్లాడారు. అయినా చెల్లుబోయినతో కలసి పనిచేసేందుకు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇష్టపడటం లేదు. తన కుమారుడికి గాని, తనకు గాని ఈసారి రామచంద్రాపురం టిక్కెట్ ఇవ్వాలని, టిక్కెట్ ఇవ్వకున్నా లేకున్నా పోటీలో ఉంటామని చెప్పి పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ హైకమాండ్ కు ధిక్కార స్వరం వినిపించారు. దీంతో పిల్లి త్వరలో పార్టీని వీడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఆయన అడుగులు జనసేన వైపు పడుతున్నట్లు చెబుతున్నారు. జనసేనలో చేరి పోటీ చేసి రామచంద్రాపురంలో గెలవాలన్నది పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆకాంక్షగా ఉంది. అవసరమైతే రాజ్యసభకు కూడా రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడం పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరూ జగన్ అంటే ఇష్టపడతామంటారు. కానీ పదవి దగ్గరకు వచ్చే సరికి రాజీలేదని చెబుతుండటంతో పిల్లి జంప్ అనివార్యమన్నది ఆయన అనుచరుల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.